జన్ధన్పై ధనాధన్!
జన్ధన్పై ధనాధన్!
- ఖాతాలపై గురి పెట్టిన ఆర్బీఐ
- విత్డ్రాయల్స్ నెలకు రూ.10 వేలే!
- కేవైసీ లేకుంటే 5 వేలు మాత్రమే
- దుర్వినియోగాన్ని అడ్డుకొనేందుకే
- ఉత్తర్వుల్లో రిజర్వు బ్యాంకు వివరణ
జన్ధన్ ఖాతాల నుంచి నగదు విత్డాయ్రల్స్ మీద రిజర్వుబ్యాంకు నియంత్రణ విధించింది. ఇక నుంచి జన్ధన్ ఖాతాదారులు నెలకు గరిష్ఠంగా రూ.10 వేలు మాత్రమే తీసుకోవచ్చు. ఖాతాదారు వివరాలు(కేవైసీ) అప్డేట్ చేసిన ఖాతాలకు మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుంది. కేవైసీ అప్డేట్ చేయని ఖాతాలకు కేవలం రూ.5 వేలు ఇస్తారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో అమాయకులైన జన్ధన్ ఖాతాదారులను అడ్డం పెట్టుకొని పాత నోట్లను మార్చుకుంటున్న నల్ల కుబేరుల్ని నిలువరించేందుకు రిజర్వు బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నియంత్రణ తాత్కాలికమేనని కొన్ని రోజుల తర్వాత ఎత్తేస్తామని రిజర్వు బ్యాంకు తెలిపింది. ఇంట్లో ఉన్న సొమ్ముంతా జన్ధన్ ఖాతాలో ఇరుక్కుపోయి, పెద్దకష్టం వచ్చిన వారి పరిస్థితేమిటనే ప్రశ్నకు కూడా రిజర్వుబ్యాంకు ఉత్తర్వుల్లో సమాధానం ఉంది.
అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకు మేనేజర్ను కలిసి సమస్యను వివరిస్తే అధికారి తన విచక్షణాధికారాన్ని వినియోగించి అదనపు సొమ్ము వితడ్రాయల్కు అనుమతిస్తారు. అందుకు కారణాన్ని బ్యాంకు పుస్తకాల్లో నమోదు చేస్తారు. జన్ధన్ ఖాతాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఇంతకుముందే రిజర్వుబ్యాంకు వాటిలో రూ.50 వేలకు మించి వేయరాదని నిబంధన పెట్టింది. దానివల్లా ఫలితం లేకుండా పోయింది. గ్రామాల్లోని జన్ధన్ ఖాతాలు చాలా వరకు రూ.49 వేల డిపాజిట్లతో నిండిపోయాయి. పెద్ద నోట్లను రద్దు చేసిన రెండు వారాల్లో రూ.27,200 కోట్లు కొత్తగా జన్ధన్ ఖాతాల్లో చేరిపోయాయి. వాటిలో చాలా వరకు నెల రోజుల క్రితం కూడా జీరో బ్యాలెన్స్తో ఉన్నవే. దేశంలో దాదాపు 25 కోట్ల జన్ధన్ ఖాతాలుంటే వాటిలోని సొమ్ము రెండు వారాల్లో రూ.45,600 కోట్ల నుంచి రూ.72,800 కోట్లకు పెరిగింది. డిసెంబరు 30 దగ్గర పడుతున్న కొద్దీ జన్ధన్ ఖాతాల దుర్వినియోగం పెరుగుతోంది. అయితే, ఇంకా 22 శాతం జన్ధన్ ఖాతాలు ఖాళీగానే ఉన్నాయి. వాటినైనా దుర్వినియోగం నుంచి కాపాడే ఉద్దేశంతో నగదు వితడ్రాయల్పై నియంత్రణ విధించారు.

Comments
Post a Comment